Published On:

KTR : మ‌రో అంత‌ర్జాతీయ సదస్సుకు కేటీఆర్.. ఆహ్వానించిన ఆక్స్‌ఫ‌ర్డ్ ఇండియా ఫోర‌మ్

KTR : మ‌రో అంత‌ర్జాతీయ సదస్సుకు కేటీఆర్.. ఆహ్వానించిన ఆక్స్‌ఫ‌ర్డ్ ఇండియా ఫోర‌మ్

BRS Working President KTR : మరో అంతర్జాతీయ సమావేశానికి బీఆర్ఎస్ వ‌ర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌రు కానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్థ కేటీఆర్‌ను ఆహ్వానించింది. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం విద్యార్థులు, ప్రొఫెసర్లు, వివిధ దేశాల నిపుణులు పాల్గొంటారు. ఇండియా సాధిస్తున్న ప్రగతిని కేటీఆర్ వివ‌రించ‌నున్నారు.

 

‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్‌తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠీ తెలిపారు. కేటీఆర్ తన అనుభవాలు, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటారని తెలిపారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించటం.. ఇండియాలోని మంచి అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై సదస్సులో వక్తలు చర్చిస్తారు.

 

వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణుల సమక్షంలో దేశ ప్రగతిపథం, తెలంగాణలో అమలు చేసిన విధానాలు, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్‌ను కేటీఆర్ వివరించనున్నారు. సదస్సులో కేటీఆర్ పాల్గొంటే రాబోయే రోజుల్లో ప్రపంచంపై భారత్ చూపే సానుకూల ప్రభావం, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి బలంగా చాటవచ్చని సిద్ధార్థ్ తెలిపారు.

 

ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సమావేశం యూరప్‌లో భారత్‌కు సంబంధించిన అతిపెద్ద కార్యక్రమం. భారత్ పురోగతి, ఆవిష్కరణలను ప్రపంచానికి చూపే వేదిక. దేశ అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న మార్పులు, గ్లోబల్ సహకార అవకాశాలపై సమావేశంలో చర్చలు జరుగనున్నాయి. ఇండియాను ప్రపంచానికి దగ్గర చేయడం, పరిశోధన, సాంకేతికత, విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఫోరమ్ ప్రధాన లక్ష్యం.

ఇవి కూడా చదవండి: