Published On:

USA, Road accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి

USA, Road accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి

USA, Road accident : అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారు. ఇండియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు అర్విన్‌ (6), అత్త సునీత (56)గా గుర్తించారు.

 

వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, ఆయన భార్య మాజీ సర్పంచ్‌ పవిత్రాదేవికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురు ప్రగతి రెడ్డికి సిద్దిపేటకు సమీపంలోని బక్రి చెప్యాల చెందిన రోహిత్‌రెడ్డితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రోహిత్‌రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటు అమెరికాలో ఉన్నారు. ప్రగతిరెడ్డి, రోహిత్‌రెడ్డి, ఇద్దరు పిల్లలు, సునీత కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రగతిరెడ్డి, పెద్దకుమారుడు అర్విన్‌, సునీత అక్కడికక్కడే మృతిచెందగా, రోహిత్‌రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్‌ కారు నడిపారు.

 

 

ఈ ప్రమాదంతో టేకులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయలు దేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: