Last Updated:

Britain PM Rishi Sunak: అక్రమ వలసదారులకు శరణార్ధి హోదా పొందే అవకాశం లేదు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌

బ్రిటన్‌లో అక్రమ వలసదార్ల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఏడాది వేలాది మంది ఇంగ్లీష్‌ చానల్‌ ద్వారా చిన్న చిన్న బోట్లలో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తుంటారు.

Britain PM Rishi Sunak: అక్రమ వలసదారులకు శరణార్ధి హోదా పొందే అవకాశం లేదు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌

Britain PM Rishi Sunak: బ్రిటన్‌లో అక్రమ వలసదార్ల బెడద రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఏడాది వేలాది మంది ఇంగ్లీష్‌ చానల్‌ ద్వారా చిన్న చిన్న బోట్లలో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తుంటారు. అట్లాంటిక్‌ సముద్రంలో ఉత్తర ఫ్రాన్స్‌ను దక్షిణ ఇంగ్లాండ్‌ను వేరు చేసే ప్రాంతం నుంచి వేలాది మంది చిన్న చిన్న బోట్లలో అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తుంటారు. ఇలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు మంగళవారం నాడు బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ కొత్త ప్లాన్‌ను ప్రకటించారు.

నిర్బంధించి తిరిగి పంపుతాం..(Britain PM Rishi Sunak)

అక్రమంగా దేశంలోకి ప్రవేశించేవారికి శరణార్ధి హోదా ఇచ్చే ప్రసక్తి లేదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోకి మీరు అక్రమంగా ప్రవేశిస్తే మీరు శరణార్ధి హోదా పొందే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి లభించే బెనిఫిట్‌లు మీకు లభించవని ఆయన అన్నారు. బ్రిటన్‌లో ఉండటానికి మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పించి దేశంలో ఉండటానికి కూడా ప్రయత్నించడానికి కూడా వీలుండదని సునాక్‌ ట్విట్‌ చేశారు.దేశంలోకి అక్రమంగా వచ్చే వారిని నిర్బంధించి కొన్ని వారాల్లో తిరిగి వచ్చిన దారినే వారి దేశానికి పంపిస్తామని, లేదా మూడవ దేశం ఉదాహరణకు రువాండా లాంటి దేశాలకు తరలిస్తామని హెచ్చరించారు. దేశం నుంచి పంపిస్తే.. మీరు భవిష్యత్తులో అమెరికా కానీ, ఆస్ర్లేలియాలో కానీ బ్రిటన్‌లో కానీ రీ ఎంట్రీకి అస్సలు వీలుండదని బ్రిటన్‌ ప్రధాని వివరించారు.

ఆధునిక బానిసత్వాన్ని ప్రోత్సహించం..

కొత్తగా ప్రవేశపెట్టే బిల్లు ద్వారా ఎవరైతే బొట్లలో బ్రిటన్‌లోకి వస్తే వారిని 28 రోజుల పాటు నిర్బంధించి తర్వాత వారిని తిప్పి పంపిస్తామని చెప్పారు. అయితే పిల్లలు ఉంటే వారికి మినహాయింపు ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వారు విమానాల్లో ప్రయాణాలు చేయలేని వారు దీర్ఘకాలం పాటు అనారోగ్యంలో ఉన్న వారు అప్పీలు చేసుకోవడానికి వీలుంటుంది. బ్రిటన్‌కు వలస వచ్చే వారు చాలా మంది హ్యుమన్‌ ట్రాఫికింగ్‌.. మనుషుల అక్రమ రవాణా ద్వారా వచ్చే వారు. అలాంటి వారిని బ్రిటన్‌లో అడుగుపెట్టనివ్వమని.. ఎందుకంటే ఆధునిక బానిసత్వాన్ని బ్రిటన్‌ ప్రోత్సహించదు. అలాంటి వారిని వచ్చిన దారినే తిరిగి పంపిస్తామన్నారు బ్రిటన్‌ ప్రధానమంత్రి.

యూరోపియన్‌ యూనియన్‌ దేశాలైన ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లతో పోల్చుకంటే బ్రిటన్‌లో శరణార్ధి హోదా కోరే వారు చాలా తక్కువే ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వలసదార్లు ప్రతి ఏడాది ఉత్తర ఫ్రాన్స్‌కు వచ్చి అక్కడి నుంచి బ్రిటన్‌కు చేరుకుంటారు. దీనికి కారణం బ్రిటన్‌లో ఎవరో ఒకరు దూరపు బంధువులు ఉండటమో లేదా ఇంగ్లీషు భాష రావడమో లేదా బ్రిటన్‌లో తేలికగా ఉద్యోగాలు దొరుకుతానే ఆశతో వస్తుంటారు. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బిల్లును మానవహక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకు వస్తున్న ప్లాన్‌ పెద్దగా పనిచేయదని.. నిస్సహాయులైన శరణార్థులను బలిపశువులను చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా 2022లో బోట్ల ద్వారా బ్రిటన్‌కు 45వేల మంది రాగా.. 2021లో 28వేల మంది 2020లో 8,500 మంది వచ్చారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.