Tapsee Pannu: నా హృదయం ముక్కలయ్యింది.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడో ఊహించా

Tapsee Pannu: సోషల్ మీడియా వచ్చాకా.. మనుషులు ఎక్కువగా అందులోనే బతుకుతున్నారు. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంత గొప్ప అన్నట్లు ఉంటున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే లైకులు కోసం నానా తంటాలు పడుతున్నారు. అసలు ఫాలోవర్స్ లేకపోతే జీవితమే లేనట్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక తాజాగా మిషా అగర్వాల్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లు తగ్గుతున్నారు అనే బాధతో ఆత్మహత్య చేసుకొని మరణించింది. మిషా మృతి నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది.
ఇక మిషా ఆత్మహత్యపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పందించింది. ఇలాంటిదేదో జరుగుతుందని.. తానెప్పుడో ఊహించినట్లు తెలిపింది. ” ప్రస్తుతం సోషల్ మీడియాపై ప్రతి ఒక్కరికి ఉన్న వ్యామోహం.. ఏదో ఒకరోజూ ఇలాంటి పరిస్థితిని తీసుకొస్తుందని ఎప్పుడో భయపడ్డాను. జీవితాన్ని మనం జీవించడం మానేసి.. మన జీవితాన్ని ప్రేమించడం మానేసి.. ఫాలోవర్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని.. మన కుటుంబం, మనల్ని ప్రేమించేవారిని వదిలేసి.. ఆన్ లైన్ ప్రేమల వైపే మొగ్గు చూపుతారని భయపడ్డాను.
అంతేకాకుండా .. మనం చదివిన చదువు.. కష్టపడి తెచ్చుకున్నా డిగ్రీలు కూడా .. ఫాలోవర్స్ లైక్స్ అధిగమిస్తాయని భయపడ్డాను. ఇప్పుడు అలాగే జరిగింది. ఇలాంటి ఒక ఘటన జరిగిందని తలుచుకుంటూనే హృదయం ముక్కలు అవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించినా ఆశించినంత గుర్తింపును సంపాదించుకోలేకపోయింది. ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్లి.. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి అక్కడే పాతుకుపోయింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఈ భామ.. తెలుగులో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.