Last Updated:

Mamata Banerjee: ‘ఇంకా ఎంత కావాలి.. కావాలంటే నాతల నరికి తీసుకెళ్లండి’

ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు.

Mamata Banerjee: ‘ఇంకా ఎంత కావాలి.. కావాలంటే నాతల నరికి తీసుకెళ్లండి’

Mamata Banerjee: అదనపు కరవు భత్యం కోసం రాష్ట్ర ఉద్యోగులు చేస్తోన్న నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్ , వామపక్షాలు మమతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ప్రభుత్వం దగ్గర నిధులు లేవు(Mamata Banerjee)

‘తరచూ డీఏ పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నదానికంటే పెంచడం కుదరదు.

ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పటికే అదనంగా 3 శాతం డీఏ ప్రకటించాం. మీకు ఇంకా ఎంత కావాలి..? ఆ పెంపుతో మీరు సంతోషంగా లేకపోతే.. నా తల నరికి తీసుకెళ్లండి’ అని మమత(Mamata Banerjee)( ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల బెంగాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అదనంగా 3 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నుంచి పెంపు అమలవుతుందని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డీఏతో సమానంగా తమకు ఇవ్వాలంటూ ఉద్యోగులు నిరసనలకు దిగారు. వాళ్లు చేస్తోన్న నిరసనలకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తుండటంపై మమత మండిపడ్డారు.

 

ప్రతిపక్ష పార్టీలపై దీదీ ఫైర్

‘కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పేస్కేల్ వేరు. వేతనంతో కూడిన ఇన్ని సెలవులను ఏ ప్రభుత్వం ఇస్తోంది? డీఏ కోసం రూ. 1.79 లక్షల కోట్లు ఖర్చుచేశాం. 40 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం.

మీరెందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలుస్తున్నారు. మా ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తోంది. కానీ గ్యాస్‌ ధర ఎంత ఉందో చూడండి..?

ఎన్నికల పూర్తి అయిన తర్వాత రోజే గ్యాస్ ధరలు పెరుగుతాయి’ అని దీదీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

రాజకీయ వ్యూహం మార్చిన టీఎంసీ

మరో వైపు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఆ పార్టీ రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తొంది.

ఇక పై బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం పాటించనుంది. ఆ రెండు పార్టీలంటే పడని ప్రాంతీయ పార్టీలతో మరో ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

బీఆర్ఎస్, ఆప్ లాంటి పార్టీలతో చర్చలు ప్రారంభించినట్టు.. తమ వ్యూహమేంటో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తుందని టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు.