Student suicide : కుటుంబాల్లో తీవ్ర విషాదం.. ఇంటర్లో ఫెయిల్ అయి ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య

Student suicide : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబానికి తీరని శోకం మిగుల్చుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు 6 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అశ్విత తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదివాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ మోతీనగర్లోని అవంతినగర్కు చెందిన విద్యార్థి బల్కంపేట కళాశాలలో ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆవేదనకు గురయ్యాడు. దీంతో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగోలులోని తట్టిఅన్నారం వైఎస్సార్ కాలనీకి చెందిన విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ పరీక్షలు రాగా, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2లోని ఇందిరానగర్లో నివాసముంటున్న సుమతి, రామకృష్ణల కూతురు నిష్ఠ స్థానిక అభ్యాస జూనియర్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నది. కెమిస్ట్రీలో ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన విద్యార్థిని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివింది. రెండో సంవత్సరం ఫలితాల్లో తాను అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని ఆత్మహత్యకు పాల్పడింది.