Rain alert in india: వాతావరణ శాఖ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

Summer: దేశంలో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ముఖ్యంగా వాయువ్య భారత్ లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
కాగా దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడతాయనే వాతావరణశాఖ సమాచారంతో కొంత ఉపశమనం కలగనుంది.
ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, విదర్భా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతుందని చెప్పింది. గంటకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఒడిశాలో కొన్ని ప్రాంతాలకు మాత్రం భారీ వర్షసూచన ఉన్నట్టు ప్రకటించింది.
ఇక జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో విస్తారంగా వర్షాలు పడొచ్చని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోనూ వర్షాలు పడతాయంది.
ఇక ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లో భారీ బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో ఉరుములు, మెరుపులతో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వివరించింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వేసవి సమయంలో మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయటకు రావొద్దని సూచించింది. మరోవైపు వేసవిలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తాగాలని చెప్తున్నారు. సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలని తెలుపుతున్నారు.