Revanth Reddy on Delimitation : దక్షిణాదిపై బీజేపీ కక్ష.. డీలిమిటేషన్పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Delimitation : దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. డీలిమిటేషన్పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ నేరుగా అధికారంలో లేదని, ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ఆరోపించారు. ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..
డీలిమిటేషన్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేసేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్కు సిద్ధమవుతోందని తెలిపారు. దక్షిణాదిలో బీజేపీ పార్టీకి సరైన ప్రాతినిధ్యం లేదని చెప్పారు. ఎన్టీయే మూడోసారి అధికారం చేపట్టినా 240 సీట్లలో దక్షిణాది నుంచి 29 స్థానాలు దక్కించుకుంది. అందుకే నియోజకవర్గాల పునర్ విభజన చేయాలని భావిస్తోందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ సమక్రంగా అమలు చేశాయని చెప్పారు. ‘మేమిద్దరం మనకు ఇద్దరు’ అనే నినాదం గతంలో కేంద్రం తెచ్చిందని గుర్తుచేశారు. దానికి కట్టుబడి ఉండడం వల్లే దక్షిణాదిన జనాభా తగ్గిందన్నారు. 30 ఏండ్లపాటు డీలిమిటేషన్ అమలు చేయకుండా ఉంటే దక్షిణ భారతదేశ సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు.
30 ఏళ్ల తర్వాత ప్రక్రియ చేపట్టాలి..
30 ఏళ్ల తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతోపాటు పంజాబ్ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. డీలిమిటేషన్ జరిగితే 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే చేయాలని కోరారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు.
గుజరాత్కే పెట్టుబడులా..?
దేశానికి వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్కు ప్రధాని మోదీ తరలించుకుపోతున్నారని, ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు. ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు రూ.70 వేల కోట్ల అప్పు ఉన్నదని, కేసీఆర్ హయాంలో రూ.7లక్షల కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. తాము ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు రాష్ట్రానికి ఇంత అప్పు ఉందని తెలియదన్నారు. నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుందని, అందులో రూ.13 వేల కోట్లు జీతాలు, అప్పులు చెల్లించడానికే సరిపోతోందన్నారు. మిగిలిన రూ.5 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మౌలిక వసతుల ప్రాజెక్టులపై రూ.500 కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నామని సీఎం చెప్పారు.