IPL 2025: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఐపీఎల్ మ్యాచ్ స్టేడియం మార్పు

PBKS Vs MI: పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే దాడి అనంతరం భారత్ మరింత అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు, పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది. ఈ నేపథ్యంలోనే మే 11న ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ స్డేడియాన్ని బీసీసీఐ మరోచోటుకు మార్చింది. మ్యాచ్ ను ధర్మశాల నుంచి గుజరాత్ లోని అహ్మదబాద్ కు మార్చుతున్నట్టు వెల్లడించింది. దీంతో నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కు ఎలాంటి మార్పులు లేవని బీసీసీఐ చెప్పింది. మ్యాచ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నారు. స్టేడియానికి వచ్చే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నారు. దీంతో మ్యాచ్ ల నిర్వహణపై ప్రేక్షకుల్లో కొంత ఆందోళన మాత్రం నెలకొంది.