Simhachalam: సింహాచలంలో ఘోర విషాదం.. నిద్రలోనే చనిపోయారు

Wall Collapse At Simhachalam Temple 8 People Dead: ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విశాఖ జిల్లాలోని సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేళ అపశ్రుతి జరిగింది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల ప్రకారం.. సింహాచలం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. అయితే అప్పన్న నిజరూప దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు రూ.300 టికెట్ క్యూ లైన్కు వెళ్లే మార్గంలోని కొత్త కాంప్లెక్స్ వద్ద రాత్రి నిద్రపోయారు. వారంతా గాఢనిద్రలో ఉండగా.. సుమారు 2 గంటలకు అక్కడే పక్కన కొత్తగా నిర్మించిన ఓ సిమెంట్ గోడ.. ఈదురుగాలులతో పాటు భారీ వర్షానికి కూలి అక్కడే నిద్రిస్తున్న భక్తులపై పడింది. దీంతో భక్తులు శిథిలాల కింద చిక్కుకొని నిద్రలోనే చనిపోయారు.
ఇదిలా ఉండగా, కాంప్లెక్స్ వద్ద గోడ నిర్మించిన కాంట్రాక్టర్, అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.300, రూ.1000 టికెట్ లైన్లను క్యాూకాంప్లెక్స్కు అనుసంధానం చేస్తూ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో కాంక్రీట్ బీమ్ కానీ దిమ్మె లాంటివి నిర్మించకుండా నేరుగా 20 అడుగుల గోడ కట్టినట్లు భక్తులు చెబుతున్నారు. భారీ వర్షం పడడంతో పాటు మట్టికొట్టుకురావడంతో ఒత్తిడి పెరిగి గోడ కూలడంతో భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాకుండా, రూ.300 టికెట్ క్యూకాంప్లెక్స్ వద్ద దర్శన మార్గంలో నిర్మించిన గోడ వద్ద భారీ టెంట్ ఏర్పాటు చేశారు. ఈదురుగాలులకు ఆ టెంట్ గోడపై పడడంతో కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే అప్పన్న చందనోత్సవాల్లో భాగంగా 20 రోజుల కిందటే ఈ గోడను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే, సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవంలో గోడ కూలి భక్తులు చనిపోవడం తనను కలిచివేసిందన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలి జరిగిన ఈ ప్రమాదంలో భక్తులు చనిపోయారని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న పరిస్థితులపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు.