Amit Shah : కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.. అమిత్ షా

Amit Shah : ఆర్టికల్ 370 రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’అనే రాజ్యాంగ నిర్మాతల కలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని, ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు చెప్పారు. రాజ్యసభలో హోంశాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల పనితీరుపై అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జమ్ములో ఉగ్రఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. 2004-2014 మధ్య జమ్ము కశ్మీర్ ప్రాంతంలో 7,217 ఉగ్రవాద ఘటనలు జరిగాయని చెప్పారు. 2014 నుంచి 2024 మధ్య 2,242కి తగ్గిందన్నారు. ప్రధాని మోదీ పాలనలో కశ్మీర్లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా అణచి వేశామన్నారు.
2026 మార్చివరకు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. ఉగ్రఘటనలే కాకుండా రాళ్ల దాడులు కూడా తగ్గాయని తెలిపారు. కశ్మీర్ యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2019 నుంచి 2024 వరకు యువతకు 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించినట్లు లెక్కలతో సహా వివరించారు. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. పెట్టుబడులు కూడా పెరిగాయన్నారు. జమ్ములో ఇప్పటికే రూ.12,000 కోట్ల విలువలైన పెట్టుబడులు వచ్చాయని, రూ.1.1 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఇప్పుడు కశ్మీర్లో సాయంత్రం పూట కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయని అమిత్ షా తెలిపారు.