Vallabhaneni Vamsi : వల్లభనేనికి ఏప్రిల్ 1వరకు రిమాండ్.. విధించిన గన్నవరం కోర్టు

Vallabhaneni Vamsi : వైసీపీ నేత వల్లభనేని వంశీని పీటీ వారెంట్పై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో హాజరు పర్చారు. విచారణ చేసిన న్యాయస్థానం ఏప్రిల్ 1 వరకు వంశీకి రిమాండ్ విధించింది. అనంతరం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయి విజయవాడ జిల్లా జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని.. ఆమె కుమారులను ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్ చేసుకున్నానని శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ఆత్కూరు పోలీసులు రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో పోలీసులు ఇటీవలే పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించడంతో మంగళవారం విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లి కోర్టులో హాజరు పర్చారు.
తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని వంశీ తెలిపారు. పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేందుకు జైలు అధికారులను ఆదేశించాలని వల్లభనేని వంశీ న్యాయమూర్తిని కోరారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలు ఇవ్వలేనని గన్నవరం కోర్టు తెలిపింది. సంబంధిత కోర్టులో పరిష్కరించుకోవాలని వంశీకి సూచించింది. మెడికల్ రిపోర్టులు పొందుపర్చాలని, వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఇచ్చే అంశంపై ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.