CM Revanth reddy : తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు క్రీయాశీల పాత్ర.. సీఎం రేవంత్రెడ్డి

Revanth reddy, Appointment letters for 1,532 people : నిరుద్యోగ సమస్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యమంపై బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేసులు కోర్టుల్లో ఉండటతో సమస్యను పరిష్కరించామన్నారు. గతంలో సంతలో సరకులా ప్రశ్నపత్రాలు విక్రయించారని ఆరోపించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉందని పెద్దలు చెప్పినట్లు గుర్తుచేశారు. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, 11వేల ప్రైవేట్ పాఠశాలల్లో 36.7లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు రూ.25వేల వరకు ఖర్చు అవుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో రూ.లక్ష వరకు ఖర్చవుతోందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ను విద్యాశాఖ తీర్చిదిద్దాలని కోరారు. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు. విద్యాశాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వం అండగా ఉందన్నారు. విద్యకు ప్రాధాన్యం ఇచ్చి విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించామని సీఎం వివరించారు.