Ranya Rao : నన్ను మాటలతో హింసించారు… నటి రన్యారావు ఆరోపణలు

Ranya Rao : నటి రన్యారావు డీఆర్ఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఎదుట ఆమె బోరున విలపించారు. కస్టడీలో తనను శారీరకంగా హింసించారా లేదా అని కోర్టు ప్రశ్నించగా, నటి రన్యారావు భావోద్వేగానికి గురయ్యారు. తనను మానసికంగా హింసించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నటి మాట్లాడారు. తనను మాటలతో హింసించి, బెదిరించారన్నారు. చాలా భయపడిపోయాయని, మానసికంగా కుంగిపోయానని ఆమె కోర్టులో చెప్పారు. డీఆర్ఐ మాత్రం ఆమె ఆరోపణలను తోసిపుచ్చింది. అరెస్టు, విచారణ సహా మొత్తం ప్రక్రియ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిందని అధికారులు వెల్లడించారు. నటి రన్యారావు అరెస్టు తర్వాత ఆమెని శారీరకంగా హింసించారనే ఆరోపణలు వచ్చాయి. ఆమె కళ్ల కింద గాయాలు ఉన్న ఫొటో వైరల్గా మారింది. దీంతో కోర్టుకు రన్యారావు జవాబు ఇవ్వడంతో ఊహాగానాలకు తెరపడింది.
రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ..
నటి రన్యారావుకు కోర్టు విధించిన మూడు రోజుల డీఆర్ఐ కస్టడీ సోమవారంతో పూర్తయ్యింది. దీంతో అధికారులు ఆమెను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నటికి రెండువారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. ఇటీవల బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఆమె పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని బెంగళూరుకు తీసుకువచ్చింది. దీంతో విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో నటికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఈ కేసును ఆదివారం సీబీఐ టేకోవర్ చేసింది. ప్రస్తుతం సీబీఐ అధికారులు కూడా నిందితురాలు రన్యారావును విచారిస్తున్నారు. ఆమె గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ వెనుక కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ హస్తం ఉన్నదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తున్నది. ప్రతిపక్ష బీజేపీనే రన్యారావుకు అండగా ఉన్నదని, బీజేపీ హయాంలో ఆమెకు ప్రభుత్వ భూమి కేటాయించడమే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తుంది.