Last Updated:

cash-for-query case: క్యాష్‌ ఫర్‌ క్వెరీ కేసులో ముహువా మొయిత్రాపై వేటు

దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారంలో తాజాగా ఊహంచని పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై వేటు పడింది.

cash-for-query case: క్యాష్‌ ఫర్‌ క్వెరీ కేసులో ముహువా మొయిత్రాపై వేటు

cash-for-query case: దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారంలో తాజాగా ఊహంచని పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై వేటు పడింది. దీనిపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్.. తాజాగా ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించే సిఫార్సును ఆమోదించింది. 6:4 ఓటింగ్‌ తీర్పుతో ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది.

అనుకూలంగా ఆరుగురు సభ్యులు..(cash-for-query case)

మహువా మొయిత్రాను బహిష్కరించాలన్న సిఫార్సుకు అనుకూలంగా ఆరుగురు సభ్యులు ఓటు వేయగా.. నలుగురు మాత్రం దాన్ని వ్యతిరేకించి మొయిత్రాకు మద్దతుగా నిలిచారు. మోయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, హేయమైనవని.. ఆమె నేరానికి పాల్పడిందని చెబుతూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎథిక్స్ ప్యానెల్ సూచించింది. ఈ కమిటీ సిఫార్సును రేపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నారు. మొయిత్రాను బహిష్కరించాలని సిఫార్సుకు మద్దతుగా అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, ప్రణీత్ కౌర్, వినోద్ సోంకార్, హేమంత్ గాడ్సే ఉన్నారు. ఇక వ్యతిరేకించిన వారిలో డానిష్ అలీ, వైతిలింగం, పీఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్ తదితరులున్నారు.

లాగిన్ వివరాలు ఇచ్చానంటూ ఒప్పుకోలు..

ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ, అదాని గ్రూపుపై ప్రశ్నలు సంధించేందుకు మొయిత్రా ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు. తన పార్లమెంటరీ లాగిన్ వివరాల్ని సైతం అతనితో పంచుకుందని, మొయిత్రాపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆయన లేఖ రాశారు. తాను లాగిన్ వివరాలు తీసుకుంది నిజమేనని హిరానందాని అంగీకరిస్తూ సంతకం చేసిన ఓ అఫిడవిట్ కూడా తెరమీదకి వచ్చింది. మొదట్లో ఈ ఆరోపణల్ని మొయిత్రా అంగీకరించలేదు .కానీ.. చివరికి తాను లాగిన్ వివరాలు ఇచ్చింది నిజమేనని ఒప్పుకున్నారు.

ఈ ఆరోపణల్ని తీవ్రంగా తీసుకున్న పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ.. ఆమెపై విచారణ చేపట్టింది. ఇదివరకే ఒకసారి ఆమెను ప్రశ్నించింది. కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వ శాఖల నుంచి నివేదికలు తెప్పించుకొని.. మరింత లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. దుబాయ్ నుంచి మోయిత్రా పార్లమెంటరీ అకౌంట్‌లో పలుసార్లు లాగిన్ అయినట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే.. ఎథిక్స్ కమిటీ మొయిత్రాపై 500 పేజీలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. గురువారం మరోసారి సమావేశమైన ప్యానెల్.. ఆమెను బహిష్కరించాలన్న సిఫార్సుకు ఆమోదం తెలిపింది. అటు.. మొయిత్రాపై ఆరోపణలు గుప్పించిన నిషికాంత్ దూబేని సైతం ఎథిక్స్ కమిటీ విచారించడం గమనార్హం.