Janaki Vs State of Kerala: అనుపమ కొత్త చిత్రం.. సెన్సార్ కార్యాలయం ఎదుట నిరసన

Anupama: ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రంలో కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. సెన్సార్ బోర్డు తీరుపై మలయాళ చిత్ర పరిశ్రమ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేరళలోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. అమ్మ, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో మలయాళ సినీ, సీరియల్ ఆర్టిస్టుల సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెన్సార్ తీరును ఖండించారు. ఇలా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదన్నారు. సెన్సార్ చెప్పిన విధంగా పేరు మారిస్తే మూవీలోని చాలా సంభాషణలు మార్చాల్సి వస్తుందన్నారు.
థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ రూపొందింది. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో జానకిగా అనుపమ కనిపించనున్నారు. న్యాయవాదిగా ప్రముఖ నటుడు సురేశ్ గోపి నటించారు. కోర్ట్రూమ్ డ్రామా చిత్రం విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరు జానకి కావడం, సినిమాలో దాడికి గురైన మహిళా పాత్రకు పేరు పెట్టడం సమంజసం కాదని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి తెలిపింది. మూవీ పేరు మార్చాలని కోరింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ మూవీకి సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.