KCR : రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు.. కేసీఆర్ సంచలన ఆరోపణ
KCR, Harish Rao meet at Erravelli Farmhouse : సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం భేటీ అయ్యారు. మూడున్నర గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ చర్చించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 5వ తేదీన కేసీఆర్, 9న మాజీ మంత్రి హరీశ్రావు, కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా, విచారణలో వినిపించాల్సిన వాదనలు, వివరణలపై ఇద్దరూ చర్చించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టును ఎల్అండ్టీ తప్పు పట్టడంపై గురించి చర్చించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్టు ఎలా ఇస్తారన్న ఎల్అండ్టీ సంస్థ ప్రశ్నను కమిషన్ ఎదుట ప్రస్తావించాలని చర్చించారు. నిర్మాణ సంస్థ లేఖతో ఎన్బీఎస్ఏ నివేదికలో డొల్లతనం బయటపడిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకు జరిగిన ప్రక్రియను వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్ కోరనున్నట్లు నిర్ణయించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల తెలిసింది. జూన్ 5వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈ నెల 21న జస్టిస్ ఘోష్ నోటీసులు పంపారు. దీంతో కేసీఆర్ న్యాయ నిపుణులు, పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, తక్కువ సమయంలో నిర్మించిన తీరు తదితర అంశాలను కమిషన్కు వివరించవచ్చని నాయకులు సూచనలు చేశారు. దీంతో ఏకీభవించిన కేసీఆర్ హాజరుకావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.