Rammohan Naidu : విమాన ఛార్జీలు పెంచొద్దు : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు పెద్దసంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలకు సుమారు రూ.20వేల టిక్కెట్ల ధరలు పెంచారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. విమాన ఛార్జీలు పెంచొద్దని ఎయిర్లైన్స్ సంస్థలను కోరింది.
ఎయిర్లైన్ కంపెనీలకు కఠినమైన సూచనలు..
జమ్ముకశ్మీర్ నుంచి వెళ్లే పర్యాటకులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం తాము నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విమాన ఛార్జీల పెంపును నివారించేందుకు ఎయిర్లైన్ కంపెనీలకు ఇప్పటికే కఠినమైన సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడి తర్వాత 6 గంటల్లో 3,337 మంది ప్రయాణికులు శ్రీనగర్ నుంచి విమానాల్లో ప్రయాణించారని వెల్లడించారు.
ఎయిర్పోర్ట్కు పెరిగిన ప్రయాణికుల తాకిడి..
మరోవైపు జమ్ముకశ్మీర్ను వీడేందుకు విమానాశ్రయానికి పెద్దసంఖ్యలో తరలివస్తున్న వారికి, అక్కడ చిక్కుకున్న ప్రయాణికులకు అన్నిఏర్పాట్లు చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదనపు విమాన సర్వీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా దీన్ని ధ్రువీకరించింది.