Amit Shah : ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం

Amit Shah : ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు- 2025కు లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడారు. విద్యా, వ్యాపార పరంగా ఇండియాలోకి విదేశీయులను ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ, దురుద్దేశంతో దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామని హెచ్చరించారు.
విద్యా, వైద్యం, పర్యాటకం, వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఇండియాకు రావాలనుకుంటే కేంద్రం ఆహ్వానిస్తుందన్నారు. దేశాభివృద్ధికి సహకరించే వారికి తాము ఎల్లప్పుడు సహకరిస్తామన్నారు. కానీ దురాలోచనతో దేశంలోకి ప్రవేశించి హాని కలిగించాలనుకునే వారి పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని దేశంలో అడుగు పెట్టనివ్వం తేల్చి చెప్పారు. అలాంటి వారికి తమ దేశం ధర్మశాల కాదని గుర్తు పెట్టుకోవాలని షా హెచ్చరించారు.
ఈ బిల్లు ఇండియా సందర్శించే ప్రతి విదేశీయుడి గురించిన సమాచారాన్ని స్వీకరిస్తుందని అమిత్ షా తెలిపారు. అక్రమంగా మయన్మార్ నుంచి దేశంలోకి వచ్చే రోహింగ్యాలు, బంగ్లా దేశీయుల సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలతో లోనికి రానిస్తే అది ఇండియాకు సురక్షితం కాదని హితవు పలికారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు దేశ భద్రతను పటిష్టం చేయడంతో పాటు 2047 నాటికి ఇండియాను ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ టీఎంసీపై షా తీవ్ర ఆరోపణలు చేశారు.
మమతా ప్రభుత్వం వారికి సహకరిస్తోంది..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారు అక్రమ చొరబాట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. చొరబాట్లను నివారించేందుకు కంచె ఏర్పాటు కోసం మమతా సర్కారు భూమిని కేటాయించలేకపోయిందని ఆరోపించారు. చొరబాటుదారులపై దయ చూపుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే 450 కిలోమీటర్ల సరిహద్దులో కంచె వేసే పనులు పూర్తి కాలేదన్నారు. అక్రమ వలసదారులకు ప్రభుత్వం ఆధార్ కార్డులు అందించి వివిధ ప్రాంతాల్లో వారికి సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. దక్షిణ 24 పరగణాల్లో అధిక సంఖ్యలో ఆధార్ కార్డులను గుర్తించామన్నారు. కానీ ప్రజలు చింతించాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాది బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.