PM Modi Serious on Congress Party: కాంగ్రెస్ అధికారం కోసం రాజ్యాంగాన్ని ఆయుధంగా వాడుకుంటోంది: ప్రధాని మోదీ!

PM Modi Serious on Congress party regarding Waqf Act: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంగా వాడుకుంటూ ఓటు బ్యాంకు వైరస్ను వ్యాప్తి చేసిందన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు వారికి పార్టీలో ఉన్నత స్థానాలను ఇవ్వలేదని ప్రశ్నించారు. ముస్లిం అభ్యర్థులకు 50 శాతం ఎన్నికల టికెట్లను ఎందుకు రిజర్వ్ చేయలేదని ఆరోపించారు.
అంబేద్కర్ విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి..
హర్యానాలోని హిస్సార్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ ఎయిర్ పోర్టుకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాణ డాక్డర్ బీఆర్ అంబేద్కర్ను గుర్తుచేసుకుంటూ ఆయన పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. కానీ, దేశ ప్రజల కోసం ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం పొందేందుకు ఒక సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయంలో అత్యవసర పరిస్థితి సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశారని ప్రధాని దుయ్యబట్టారు. రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నేతలు ఎప్పుడూ వాటిని పాటించలేదన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం ఇటీవల ఆమోదం..
పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం పొందగా, 2025 ఇటీవల అమల్లోకి వచ్చింది. ఏన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విపక్షాలకు చెందిన ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం 15 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 16న విచారణ జరపనుంది. మరోవైపు వక్ఫ్ సవరణల చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 14, 25, 26 ఆర్టికల్స్ను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందన్నారు. పలు రాష్ట్రాల్లో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన ఆందోళనల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు అదుపు తప్పడంతో 110 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.