Jamili Elections : ఒకే దేశం-ఒకే ఎన్నిక.. జేపీసీ గడువు పొడిగింపు

Jamili Elections : జమిలి ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్సభ అంగీకరించింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఇవాళ ఆమోదం తెలిపింది.
బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలి..
వర్షాకాల సమావేశాల చివరివారంలో మొదటిరోజు వరకు గడువు పొడిగించింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని పతిపక్షాలు ఆరోపించాయి. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటైంది.
ఏప్రిల్ 4న ముగియనున్న కమిటీ కాలపరిమితి..
లోక్సభ నుంచి 27 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 12 మంది ఉన్నారు. ఈ కమిటీ కాలపరిమితి ఏప్రిల్ 4న ముగియనుంది. ఈ బిల్లుపై చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిగాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, ప్రఖ్యాత న్యాయకోవిదుడు హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.పీ.షాలు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. జేపీసీ గడవు పొడిగించే తీర్మానానికి లోక్సభ తాజాగా ఆమోదం తెలిపింది.