Last Updated:

Former CM Atishi: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ.. తొలి మహిళ ఎన్నికకావడం ఇదే మొదటిసారి

Former CM Atishi: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీ.. తొలి మహిళ ఎన్నికకావడం ఇదే మొదటిసారి

Former CM Atishi Becomes First Woman Leader Of Opposition In Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీని ఆప్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా, మిగతావారంతా మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నికకావడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమవేశానికి హాజరయ్యారు.

పార్టీ క్లిష్ట కాలంలో ఢిల్లీ సీఎంగా సేవలు..
అనంతరం ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆతిశీని ఏకగ్రీవంగా నిర్ణయించామని, పార్టీ క్లిష్ట కాలంలో ఢిల్లీ సీఎంగా ఆమె సేవలందించారని ప్రశంసించారు. ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఆప్ తన బాధ్యతలను నెరవేరుస్తుందని చెప్పారు.

హామీలు నెరవేర్చాలి : ఆతిశీ
అనంతరం ఆతిశీ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి, ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నందుకు కేజ్రీవాల్‌తోపాటు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ప్రజల తరఫున బలమైన గొంతుకను వినిపిస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బీజేపీ సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ప్రజలు ఆప్‌కు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, బలమైన ప్రతిపక్షం ఎలా పనిచేస్తుందో తాము చూపిస్తామని తెలిపారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే మహిళలకు ఆర్థిక సాయం అంశాన్ని ఆమోదించి మార్చి 8న నాటికి వారి అకౌంట్లలో రూ.2,500 వేస్తామని మోదీ హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. హామీని అమలయ్యేలా చూడం తమ బాధ్యత అని చెప్పారు. ఎన్నికలకు ముందే తాము కాగ్ నివేదికను స్పీకర్‌కు పంపామని, దానిని ఆయన ప్రెజెంట్ చేసినట్టు వాళ్లు (బీజేపీ) గందరగోళం సృష్టించారని తెలిపారు.

ఈ 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీ..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పాలనకు తెరదించుతూ.. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. రేఖాగుప్తా నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ఢిల్లీ అసెంబ్లీ తొలి సెషన్‌ ప్రారంభం కానుంది. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. బీజేపీ నేత విజేంద్ర గుప్తాను స్పీకర్‌గా నామినేట్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అరవింద్ సింగ్ లవ్లీని ఎల్జీ నియమించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న సమావేశాల్లో గత ఆప్ ప్రభుత్వ పనితీరుపై పెండింగ్‌లో ఉన్న కాగ్ నివేదికలను ప్రవేశపెడతామని అధికార బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.