Revanth Reddy : 2021లో 3,5 తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే : సీఎం రేవంత్రెడ్డి

Revanth Reddy : ప్రతిస్థాయిలో విద్యారంగం రోజురోజుకూ క్షీణించిపోతోందని సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలిలో విద్యాశాఖపై ఆయన మాట్లాడారు. 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగిందని గుర్తుచేశారు. సర్వే ప్రకారం 75శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదని చెప్పారు. తెలంగాణ ర్యాంకు చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరిజ్ఞానంలో రాష్ట్రం 36వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అథమ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5 తరగతి విద్యార్థులు 2 తరగతి పుస్తకాలు చదవలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి స్థాయిలో విద్యారంగం రోజురోజుకూ క్షీణించి పోతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజం బాధ్యత తీసుకోవాలి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11వేలకు పైగా టీచర్ల నియామకం చేపట్టామని చెప్పారు. 21వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. 8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 36వేల మంది టీచర్ల బదిలీ చేపట్టామన్నారు. 36వేల మంది టీచర్లను ఆరోపణలు లేకుండా బదిలీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై రూ.1.08లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో రూ.50వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో రూ.లక్ష ఖర్చవుతోందని చెప్పారు.
బడ్జెట్లో విద్యకు రూ.23,108 కోట్లు కేటాయించామన్నారు. విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించినా ప్రమాణాలు పడిపోతున్నాయని, ఇందుకు ప్రభుత్వమే కాదు.. సమాజం బాధ్యత తీసుకోవాలని కోరారు. లోతుగా విశ్లేషించి సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో ఆలోచన చేసినంత కాలం విద్యారంగం ప్రక్షాళన కాదని, విద్య పట్ల ప్రత్యేక విధానం తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. విద్యారంగం బలోపేతానికి సూచనల కోసం విద్యా కమిషన్ ఏర్పాటుచేశామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలి..
ఏటా లక్షకు పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారని, రూ.15వేలకు ఇంజినీరింగ్ విద్యార్థులు పనిచేసే పరిస్థితి నెలకొందన్నారు. నైపుణ్యం ఉన్న యువత అసలే దొరకటం లేదని కంపెనీలు చెబుతున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి సాధించిందని ఒడిశా, బిహార్ నుంచి రావటం లేదని, మన వద్ద ఉన్న విద్యార్థులకు నైపుణ్యం లేక రోడ్లపై తిరుగుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
మన నిర్లక్ష్యంతోనే సమాజ నైపుణ్యాల మేరకు విద్యార్థులను అప్గ్రేడ్ చేయలేదన్నారు. నైపుణ్యాల పెంపునకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా పత్రిక ద్వారా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమం నడిపారని గుర్తుచేశారు. గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో విద్యా ప్రమాణాల మెరుకు చర్యలు తీసుకుంటాని స్పష్టం చేశారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తేనే స్థానిక సంస్థల్లో పోటీకి, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశంపై చర్చించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు ఉండాలని తెలిపారు.