Last Updated:

Smart meters issue: ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. ప్రభుత్వం X రైతు సంఘాలు

ఏపీలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Smart meters issue: ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. ప్రభుత్వం X రైతు సంఘాలు

Andhra Pradesh: ఏపీలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే అంశం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై అనేక విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రైతులకు నష్టం చేస్తుందని, అందువల్ల దీన్ని అమలు చేసే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్ఫష్టం చేసింది.

మరోవైపు ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉండటం పై రైతు సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారదర్శకత, జవాబుదారీతనం కోసమే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నప్పటికీ ఈ పథకం పై రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. నేరుగా డైరెక్ట్ టు ట్రాన్స్ఫర్, డీబీటీ విధానంలో లబ్ధిదారులైన రైతుల ఖాతాలకే నేరుగా నగదు జమ చేస్తామని ఆయన వెల్లడించారు. రైతులు నేరుగా తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును డిస్కంలకు చెల్లిస్తారని పెద్దిరెడ్డి చెబుతున్నారు. అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతుండటం కూడా గ్యాస్ సబ్సిడీనే తలపిస్తుందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుతం ఉచిత వ్యవసాయ విద్యుత్ అమల్లో ఉంది. దాన్ని ఎత్తేసి వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం, వచ్చే విద్యుత్ బిల్లులకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులేయడం, రైతులు డిస్కమ్‌కు కరెంటు బిల్లులు చెల్లించడం. అసలు ఇదంతా ఎందుకని నిలదీస్తున్నారు రైతు సంఘాల నాయకులు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను యథావిధిగా అమలు చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. రైతులే నేరుగా బిల్లులు చెల్లిస్తే డిస్కమ్‌ను నాణ్యమైన విద్యుత్‌ పై ప్రశ్నించే వీలు కలుగుతుందని చెబుతోంది. తద్వారా డిస్కమ్‌లు బాధ్యతగా ఉంటాయంటోంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో 18 వేల మీటర్లు రైతుల మోటర్లకు బిగించామని మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రభుత్వం వివరించింది. ఆ మీటర్ల వల్ల 30–36 శాతం విద్యుత్ ఆదా అవుతోందంటూ గణాంకాలు చూపుతోంది. ముందు రైతులు తమ మీటర్లకు వచ్చిన బిల్లులు కట్టాలని ప్రభుత్వం చెబుతోంది. తర్వాత ఆ బిల్లుల మొత్తాలను లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామంటోంది. ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా, సకాలంలో రైతుల ఖాతాల్లో బిల్లుల మొత్తం వేయకపోయినా ఇబ్బందే అంటున్నారు పరిశీలకులు. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించకలేకపోతే డిస్కమ్‌ కరెంటు సరఫరా ఆపివేయడం ఖాయమంటున్నారు.

మొత్తం మీద స్మార్ట్ మీటర్ల వల్ల ఇబ్బంది పడేది రైతులేనని చెబుతున్నారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టెండర్ల పైనా వివాదాలు రేకెత్తుతున్నాయి. ఈ టెండ్లర అప్పగింతలో గోల్మాల్ జరుగుతోందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కొత్త స్కీమ్ జగన్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతోందా? అన్న ఆందోళన కూడా వైసీపీ పెద్దల్లో వ్యక్తం అవుతోంది.

 

 

 

ఇవి కూడా చదవండి: