Vishweshwar Reddy: కేసీఆర్, కేటీఆర్కు శిక్షపడాలి: విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు

MP Vishweshwar Reddy Sensational Comments: ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేసినందుకు తనపై కూడా తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లాలన్నారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొండాను అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ నిరూపించేందుకు అవసరం అయితే కేంద్రం నుంచి సాయం తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పార్లమెంట్లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. మళ్లీ ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్కు తప్పక శిక్షపడాలన్నారు. గతంలో తన ఫోన్ చాలాసార్లు ట్యాప్ అయ్యిందని, దీనిపై గతంలో తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. సీడీఆర్ లిస్టులో కొండా నంబర్ ఉన్నట్లు సిట్ తెలిపింది.