Last Updated:

Rajnath Singh : రాజ్‌నాథ్‌సింగ్‌తో అమెరికా డీఎన్‌ఐ తులసీ గబ్బర్డ్‌ భేటీ

Rajnath Singh : రాజ్‌నాథ్‌సింగ్‌తో అమెరికా డీఎన్‌ఐ తులసీ గబ్బర్డ్‌ భేటీ

Rajnath Singh : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో అగ్రరాజ్యం అమెరికా డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు భేటీ అయ్యారు. సౌత్‌బ్లాక్‌లో ఈ మీటింగ్ జరిగింది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, ఇంటెలిజెన్స్‌ షేరింగ్‌ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం కూడా చర్చల అజెండాలో ఉంది. ఓ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిగినట్లు సమాచారం.

 

భారత్‌లో రెండున్నర రోజుల పర్యటనకు తులసీ న్యూఢిల్లీకి వచ్చారు. గ్లోబల్‌ ఇంటెలిజెన్స్‌ కాంక్లేవ్‌లో కూడా పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్‌ రెండో విడత కార్యవర్గంలోని సీనియర్‌ స్థాయి అధికారి ఇండియాను సందర్శించడం ఇదే మొదటిసారి. పర్యటన సందర్భంగా ఆమె ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య నిఘా సమాచార పంపిణీ, సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని పెంపొందించుకోవడం, ఇరుదేశాల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రత రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇండో-పసిఫిక్‌, ఖలిస్థానీ ఉగ్రవాదం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

సమష్టి లక్ష్యాలపై దృష్టి..
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మంచి మిత్రుల అని తులసీ గబ్బర్డ్‌ పేర్కొన్నారు. ఇద్దరూ సమష్టి లక్ష్యాలపై దృష్టిపెట్టారని చెప్పారు. ఇరు దేశాల సంబంధాలు ఎంతో పురాతనమైనవి అన్నారు. రెండు దేశాలు వాటిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారత్, అమెరికా పరస్పర ప్రయోజనాలను గుర్తిస్తున్నాయని చెప్పారు. శాంతి, సుసంపన్నత, స్వేచ్ఛ, భద్రత వంటి అంశాలు కేంద్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెండు గొప్ప దేశాలకు ఉత్తమ నాయకులు ఉన్నారని గుర్తుచేశారు. వారు మంచి మిత్రులు అన్నారు. సమష్టి లక్ష్యాలు, పరస్పర ప్రయోజనాలపై దృష్టిపెట్టారన్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ చాలా స్పష్టమైన వైఖరితో చూస్తున్నారని, ఆయన దృష్టి మొత్తం శాంతిస్థాపనపై ఉందని చెప్పారు. యుద్ధం ముగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, చర్చలు ఇప్పుడే మొదలయ్యాయని తులసీ ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

ఆదివారం డోభాల్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సులో పాల్గొనడానికి తులసీ ఇండియాకు వచ్చారు. సదస్సులో కెనడా నిఘాధిపతి డేనియల్‌ రోజర్స్, యూకే జాతీయ భద్రత సలహాదారు జొనాథన్‌ పొవెల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: