పాక్ మహిళతో భారతీయ యువకుడికి పెళ్లి : సరిహద్దు దాటేందుకు యత్నం.. తిప్పిపంపిన సెక్యూరిటీ సిబ్బంది

Barmer bridegroom sent back : భారతీయ యువకుడికి పాక్ మహిళతో పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెలాఖరులో వివాహం జరుగాల్సిన ఉండగా, పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి వరుడు అట్టారి క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అయితే పాక్ భారత్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది పెళ్లి కొడుకును తిప్పిపంపారు. దీంతో తన వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియక వరుడు ఆందోళన చెందాడు. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల మధ్య వివాహాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా రాజస్థాన్లోని బార్మర్ జిల్లాకు చెందిన (25) శైంతన్ సింగ్కు పాక్లోని సింధ్ ప్రావిన్స్ అమర్కోట్ జిల్లాకు చెందిన కేసర్ కన్వర్తో నాలుగేళ్ల కింద నిశ్చితార్థం జరిగింది.
పాక్ వెళ్లేందుకు ప్రయత్నం..
నాటి నుంచి పాక్ వెళ్లేందుకు వరుడు శైంతన్ సింగ్ కుటుంబం చాలా శ్రమించింది. వీసాలు పొందేందుకు మూడేళ్లుగా ప్రయత్నించింది. వీసాకు అన్ని అడ్డంకులు తొలగడంతో ఫిబ్రవరి 18వ తేదీన వీసాలు పొందింది. దీంతో ఈ నెల 30న పాక్లో జరిగే వివాహానికి కుటుంబం సిద్ధమైంది.
భారత్ కఠిన నిర్ణయాలు..
మరోవైపు జమ్ముకాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందిన నేపథ్యంలో ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకున్నది. పాక్ పౌరులకు వీసా సేవలు నిలిపివేసింది. గతంలో జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. ఇండియాలోని పాక్ పౌరులు ఈ నెల 27లోపు తిరిగి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో పంజాబ్లోని వాఘా-అట్టారీ సరిహద్దు నుంచి పాక్ పౌరులు తిరిగి వెళ్తున్నారు.
మే 12తో ముగియనున్న పెళ్లి బృందం వీసా గడువు..
పెళ్లి కొడుకు శైంతన్ సింగ్ తన బృందంతో కలిసి పాకిస్థాన్ వెళ్లేందుకు వాఘా-అట్టారీ సరిహద్దు వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని వెనక్కి పంపారు. పెళ్లి బృందం వీసా గడువు మే 12తో ముగియనున్నది. దీంతో నాలుగేళ్లుగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వరుడు శైంతన్ సింగ్, అతడి కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. పాకిస్థాన్ మహిళతో తన వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియక వరుడు ఆందోళన చెందాడు.