CM Revanth Reddy : పండుగ రోజు ప్రాణాలు కాపాడారు.. డాక్టర్లకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్రెడ్డి

CM Revanth Reddy : పండుగ నాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రాణాలు కాపాడారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడగా, సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. విశాఖకు చెందిన హేమంత్ (22) అనే యువకుడు మార్చి 29న షిర్డీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారగా, కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు హేమంత్ను అడ్మిట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు హేమంత్ను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
సెలవు రోజు కూడా..
సెలవు రోజు జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్లు రంగా అజ్మీరా, విక్రమ్ నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించారు. పేగులో రంధ్రం ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు చికిత్స చేసి వ్యర్థ పదార్థాలను తొలగించారు. 10 రోజులు చికిత్స అనంతరం హేమంత్ను డిశ్చార్జ్ చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో లక్షల ఖర్చుతో జరిగే చికిత్సను ఉస్మానియాలో ఉచితంగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో వైద్యులపై తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ రంగా అజ్మీరా సూచించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం..
ఇదే విషయమై జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు అన్న నానుడిని వైద్యులు తిరగ రాశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు క్లిష్టమైన వైద్యం అందించి యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని తెలుపుతూ వారికి నా ప్రత్యేక అభినందనలు అంటూ సీఎం రాసుకొచ్చారు.