Last Updated:

Telangana Assembly : నియోజ‌క‌వర్గంలో నేను తిరిగిన‌ట్లు నువ్వు తిర‌గ‌లేవు.. కౌషిక్ రెడ్డికి సీత‌క్క కౌంటర్

Telangana Assembly : నియోజ‌క‌వర్గంలో నేను తిరిగిన‌ట్లు నువ్వు తిర‌గ‌లేవు.. కౌషిక్ రెడ్డికి సీత‌క్క కౌంటర్

Telangana Assembly : అసెంబ్లీలో ఇవాళ మధ్యాహ్నం ఆసక్తికర చర్చ జరిగింది. రైతు సమస్యలు, రైతు రుణమాఫీ, వడ్ల బోనస్‌పై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీత‌క్క కౌంటర్ ఇచ్చారు. త‌మ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు.. నియోజ‌క‌వర్గంలో తాను తిరిగిన‌ట్లు తిర‌గ‌లేవని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఎక్కువ కాలం ఎవ‌రు అందుబాటులో ఉంటారో తేల్చుకుందామా? అని కౌంట‌ర్ ఇచ్చారు. స‌న్న‌వ‌డ్ల‌కు బోన‌స్ ఇవ్వ‌డం లేద‌ని కౌషిక్‌రెడ్డి నిలదీశారు. దీంతో కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి సీత‌క్క‌ ఖండించారు. హైద‌రాబాద్‌లో తిరిగే వారికి రైతన్నలకు బోన‌స్ వ‌స్తుందో లేదో తెలుస్తుందా? అని ప్రశ్నించారు. వడ్లకు బోనస్ ఇస్తామని బోగస్ చేసింది మీరే కాదా అన్నారు. వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా అని సీతక్క ఫైర్ అయ్యారు.

 

 

తాను ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్‌లోనే ఉంటానని చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. తన కొడుకు హనుమకొండలోనే ఉంటారని తెలిపారు. తన జీవన విధానం ప్రజలకు తెలుసు అన్నారు. తమల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదని విమర్శించారు. తమ ఇంటికి వచ్చి భోజనం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

 

 

అంతకుముందు పాడి కౌషిక్ రెడ్డి మాట్లాడారు. గత బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.31 వేల కోట్ల బడ్జెట్ పెట్టారని, నేడు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసినట్లు చెబుతున్నారని, మిగిలిన రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ ఎందుకు చేయాలేదని ప్రశ్నించారు. ఉదాహరణకు తన హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక దాదాపు 1070 మంది రైతులు రుణాలు తీసుకున్నారని, అందులో రుణమాఫీ 495 మందికి అయింది, ఇంకా 50 శాతం మందికి రుణమాఫీ కాలేదని వివరించారు.

 

 

బీఆర్ఎస్ హయాంలో రెండు విడతల్లో రూ.29,114 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు బంధు పథకం లాంటి గొప్ప పథకాన్ని కేసీఆర్ తెచ్చారని గుర్తుకుచేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం రెండు సీజన్లలో ఎగ్గొట్టిందని, మూడో సీజన్లో రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ.12 వేలు వేశామని అంటున్నారని చెప్పుకొచ్చారు. రైతులకు ఇచ్చే బోనస్ పెద్ద బోగస్ అయ్యిందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి: