AP cabinet : చేనేత కార్మికులకు ఉచిత కరెంట్.. ఏపీ కేబినెట్ ఆమోదం

AP cabinet : ఏపీలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు..
వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వైఎస్ఆర్ కడపగా జిల్లా పేరు మార్చాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలుపుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించనున్నారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరు ఉండేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరులోని కడప తొలగించింది. దీంతో నాటి నుంచి వైఎస్ఆర్ జిల్లాగా వ్యవహరిస్తున్నారు.
కేబినెట్ నిర్ణయాలు..
-నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం
-అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
-పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా
-వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం.
-సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు ఆమోదముద్ర వేసింది.