Last Updated:

MP Raghu Rama Krishnam Raju: సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటి.. ఎంపీ రఘురామకృష్ణం రాజు

సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు.

MP Raghu Rama Krishnam Raju: సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటి.. ఎంపీ రఘురామకృష్ణం రాజు

Andhra Pradesh: సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు. అయ్యన్నతో పాటు ఆయన చిన్న కుమారుడు రాజేష్ ని కూడా ఎత్తుకెళ్లడం చూస్తుంటే, వారిని పోలీసులా? ఉన్మాదులా? హంతకులా? ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సెంటు భూమి స్థల వివాదం పై కోర్టు స్టే ఉన్నప్పటికీ, అయ్యన్నను ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు. గతంలో ప్రహరి గోడ కూల్చినప్పుడే, కోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చిందన్నారు. గతంలో ప్రభుత్వ సర్వే యర్ ఇచ్చిన కాగితాలు ఉన్నాయని అయ్యన్న కుటుంబం ప్రభుత్వ అధికారులకు చూపించిందన్నారు. అయితే ఆ కాగితాలు ఫోర్జరీవని, ఫోర్జరీ కాగితాలను చూపించడమే కాకుండా, దగ్గర పెట్టుకున్నందుకే ఐపీసీ 474 సెక్షన్ కింద అరెస్టు చేసినట్లు పేర్కొనడం దుర్మార్గమని రఘురామకృష్ణంరాజు తీవ్రంగా విరుచుకపడ్డారు. ఒకవేళ అదే నిజమని అనుకున్నా, తెల్లవారుజామున అరెస్టు చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. అయ్యన్నను చితకబాదడానికే అరెస్టు చేశారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సీఐడీ పోలీసుల ఉన్మాదం పతాక స్థాయికి చేరుకుందని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఇతర కేసులు నమోదు చేయలేక, అయ్యన్నపాత్రుడుని సెంటు భూమి స్థల వివాదంలో అరెస్టు చేశారన్నారు. సెంటు భూమి స్థల వివాదాన్ని సాకుగా చూపెట్టి ఓ మాజీ మంత్రిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో, అయ్యన్నను అరెస్టు చేయించడం ద్వారా స్పష్టం అయ్యిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తుందని విమర్శించారు. ఛీ ఛీ అసహ్యం వేస్తుంది. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా? ఇటువంటి వాడు మన పాలకుడా? నరకాసురుడు, బకాసురుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు సైతం అసూయపడే విధంగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని రఘురామకృష్ణం రాజు విరుచుకు పడ్డారు.

బ్రిటిష్ పాలనలో సైతం ఇంతటి రాక్షస పాలన కొనసాగలేదని, ఇది ధరిత్రి ఎరుగని చరిత్ర అంటూ రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసి ఎక్కడకు తీసుకువెళ్లారో చెప్పకపోవడం దారుణం అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించి రాత్రికి ఆయనని గుడ్డలు విప్పించాలన్నదే పోలీసుల పథకమని పేర్కొన్నారు. ఇది ఒక చిన్న కేస్ అని స్టేషన్ బెయిల్ ఇవ్వకపోతే, కోర్టు బెయిల్ ఇస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని న్యాయంగానే అరెస్టు చేస్తే ఆయన తల్లి, చెల్లి, భార్య రోడ్డెక్కి ఆందోళన చేశారని, అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేసినందుకు యావత్ మహిళా లోకం వారి కుటుంబ సభ్యులకు అండగా రోడ్డెక్కి ఆందోళనలు చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి: