Amala: అలా జరగకపోతే నా జీవితానికి విలువ లేదు – అమల ఆసక్తికర వ్యాఖ్యలు

Amala Akkineni: హీరో నాగార్జున అక్కినేని సతీమణి, సినీ నటి అమల జంతు ప్రేమికురాలు అనే విషయం తెలిసిందే. జంతువుల సంక్షేమం, జంతు హక్కుల పరిరక్షణ కోసం ఎన్జీవో నిర్వహిస్తున్నారు. అంతేకాదు రెడ్క్రాస్తో కలిసి జంతువుల సంరక్షణకు ఆమె పాటుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె యానిమల్ ఛారిటీ హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా మిషన్ పేరును హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్గా మార్చారు. దీనికి సంబంధించిన కొత్త పేరు, లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్లోని స్టార్ హోటల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమల మాట్లాడుతూ.. తాను ఆరేళ్ల వయసు నుంచి జంతువుల సంక్షేమంలో తన ప్రయాణం మొదలైందన్నారు. “జంతువుల బధలను అంతం చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాను. విద్యార్థులు సైతం మాతో కలిపి పని చేసేందుకు ముందుకువస్తున్నారు. సర్కస్లో వన్యప్రాణుల నిలుపుదల చేయడం నుంచి జంతువులపై ప్రయోగాలు నిర్వహించే ప్రయోగశాలల వరకు అందరితో మాట్లాడాం” అని అన్నారు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా జంతువుల సంరక్షణ కోసం జంతు ప్రేమికులంతా కలిసి మార్పు తీసుకురావాలనేది తన లక్ష్యమని, ఈ మార్పు లేకుండ తన జీవితానికి విలువ లేదన్నారు. జంతువులు, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ మనల్ని ఒకచోటకు చేరుస్తుందని పేర్కొన్నారు. అన్ని రకాల జంతువుల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల మానవత్వం చూపే సంప్రదాయం రావాలని ఆమె ఆకాంక్షించారు. హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్ సంస్థ చేస్తున్న అద్భుతమైన కృషికి ఆమె హ్రదయపూర్వక అభినందనలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో హ్యుమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ అధ్యక్షులు, సీఈవో కిట్టి బ్లాక్తో పాటు పలువురు సంస్థ ప్రతినిథులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు.