Experts Committee: పాశమైలారం పేలుడుపై విచారణకు కమిటీ

Government React On Sigachi Explosion: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేలుడు ఘటనపై విచారణకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించిన నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిటీ చైర్మన్ గా బి. వెంకటేశ్వర్, సభ్యులుగా ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్ ను నియమించింది. కాగా నిపుణల కమిటీ ప్రమాదంపై విచారణ చేయనుంది. ప్రమాదానికి కారణం ఏంటీ? ప్రభుత్వ నిబంధనలు కంపెనీ పాటిస్తుందా అనే అంశాలపై వివరాలు రాబట్టనుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
కాగా పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రెండు రోజుల క్రితం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 40 మంది వరకు చనిపోయినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అలాగే 33 మంది వరకు గాయపడినట్టు తెలిపింది. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే గాయపడిన కార్మికులకు పూర్తి వైద్యసాయం అందిస్తామని చెప్పారు. గాయపడిన కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కార్మికులకు అన్ని రకాల బీమా క్లెయిమ్స్ చెల్లిస్తామన్నారు. వారి కుటుంబాల పోషణను కూడా కంపెనీ తరపున చూసుకుంటామని వెల్లడించారు.