BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ కన్నుమూత

BV Pattabhiram Passes Away: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాద్లో సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా పట్టాభిరామ్ ప్రసిద్ధి. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. పట్టాభిరామ్ భార్య వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు. ఖైరతాబాద్లోని నివాసంలో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
బీవీ పట్టాభిరామ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని 15 మందిలో ఒకరు. కౌమారదశలో కాలి వైకల్యంతో కలిగిన ఆత్మన్యూనతా భావాన్ని జయించి తనని తాను ఇంద్రజాలికుడిగా, రచయితగా తీర్చిద్దుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి విద్యను నేర్చుకున్నారు.
తర్వాత హైదరాబాద్లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లో సాధన చేసేవారు. 1970 దశకం నాటికి స్వతంత్రంగా రెండుమూడు గంటలపాటు ప్రేక్షకులను కదలనీయకుండా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి పట్టాభిరామ్ ఎదిగారు. జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘రెండురెళ్ల ఆరు’ చిత్రంలో నటించారు. పట్టాభిరామ్ పాత్రలోనే కనిపించారు.