Last Updated:

Rape Case : ఏలూరులో దారుణం.. 10వ తరగతి బాలికపై వాలంటీర్ అత్యాచారం.. పట్టించుకోని పోలీసులు

ఏపీలో కొంతమంది వాలంటీర్ల ఘాతుకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలో వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలపై జనసేన అధినేత ప్రశ్నించడంతో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అదే క్రమంలో బంగారం కోసం ఓ వాలంటీర్ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన,

Rape Case : ఏలూరులో దారుణం.. 10వ తరగతి బాలికపై వాలంటీర్ అత్యాచారం.. పట్టించుకోని పోలీసులు

Rape Case : ఏపీలో కొంతమంది వాలంటీర్ల ఘాతుకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలో వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలపై జనసేన అధినేత ప్రశ్నించడంతో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అదే క్రమంలో బంగారం కోసం ఓ వాలంటీర్ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన, ఆసరా పెన్షన్ డబ్బులతో వాలంటీర్ జూదం ఆడి.. డబ్బులన్నీ పోగొట్టుకున్న విషయాలు వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఆధార్ కార్డులు కావాలని వెళ్ళి పదో తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే నిందితుడికి వైకాపా నాయకుల అండ ఉండటంతోనే పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వాలంటీరు తమ బిడ్డ జీవితాన్ని పాడు చేశాడని, న్యాయం చేయాలని ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదని బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అంతటితో ఆగకుండా పరారీలో ఉన్న నిందితుడిని మీరే పట్టుకురావాలంటూ సలహా ఇచ్చారని వారు వాపోయారు. దీంతో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో జరిగింది.

ఈ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పదోతరగతి చదువుతున్న బాలికను.. స్థానికంగా వాలంటీరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలాపు శివకుమార్‌ ప్రేమ పేరుతో వేధించేవాడు.  రెండునెలల క్రితం ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు కావాలని ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా పాఠశాలకు సెలవులు రావడంతో బాలిక తన పెద్దమ్మ ఇంటికి వెళ్లగా అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఆమె వైద్యపరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది.

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అతడిని నిలదీయడంతో అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. రూ.10వేలు ఇస్తాను.. కడుపు తీయించుకోవాలని చెప్పడంతో .. వారి మధ్య వివాదం జరిగింది. చివరకు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో పెళ్లికి ఒప్పుకొన్నాడు. కానీ పెళ్లి ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత పెళ్లికి ముందు రోజు పరారయ్యాడు. ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులు ఏలూరు దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. అధికారులు లేరంటూ ఫిర్యాదు తీసుకోలేదు. దెందులూరు పోలీస్టేషన్‌కు వెళ్లినా.. కేసు నమోదుకు తాత్సారం చేశారు. పోలీసులు పట్టించుకోకపోవటంతో బాధితులు జగనన్నకు చెబుదాం, స్పందన, 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు.

దాంతో అక్టోబరు 5వ తేదీన కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో కాలయాపనపై పోలీసులను ప్రశ్నించగా.. మీరే నిందితుడిని వెతికి పట్టుకొస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు విస్మయానికి గురయ్యారు. ఇక సదరు వాలంటీరుకు స్థానిక వైకాపా నాయకుడి అండ ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని భావించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతిని వివరణ కోరగా ‘దిశ పోలీసుస్టేషన్లో అధికారులు లేని విషయం వాస్తవమే చెప్పడం గమనార్హం. బాలికపై వాలంటీరు అత్యాచారం చేసిన విషయం నా దృష్టికి రాలేదు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని.. ఒక ఆడ పిల్లకు అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి కూడా రాజకీయాలు కావాలా అని వాపోతున్నారు.