Palvai Sravanthi: మునుగోడులో ముప్పు తిప్పలు పడుతున్న పాల్వాయి స్రవంతి

మునుగోడులో కాంగ్రెస్ శ్రేణుల మద్దతుకోసం ఆమె ముప్ప తిప్పలు పడుతున్నారంట రాజగోపాల్ రాజీనామాలో బైపోల్స్ అనివార్యమైన మునుగోడు సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

  • Written By:
  • Updated On - October 10, 2022 / 06:11 PM IST

Munugode by elections: పాల్వాయి స్రవంతికి మునుగోడు ఉపఎన్నికల్లో పెద్ద పరీక్షే ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. మునుగోడులో కాంగ్రెస్ శ్రేణుల మద్దతుకోసం ఆమె ముప్ప తిప్పలు పడుతున్నారంట రాజగోపాల్ రాజీనామాలో బైపోల్స్ అనివార్యమైన మునుగోడు సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ క్రమంలో పాల్వాయి స్రవంతిని కేండెట్‌గా ప్రకటించి బరిలోకి దింపింది. దానికి తగ్గట్లే ప్రచారం మొదలుపెట్టిన స్రవంతికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయట.

మునుగోడులో త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని రంగంలోకి దించింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పేరును ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపాదించడంతో, పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అధినాయకత్వం. ఇక ఈ క్రమంలో మునుగోడులో విజయం సాధించడం కోసం పాల్వాయి స్రవంతి పని మొదలు పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలో తనకు పూర్తి సహకారం అందించాలని మునుగోడు ముఖ్య నేతలను కలిసి పాల్వాయి స్రవంతి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసిన పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి వారి సహకారం కావాలని కోరారు. రెండు రోజులుగా కీలక నేతలను కలుస్తున్న పాల్వాయి స్రవంతి, పార్టీ నేతల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేకుండా, ప్రతి ఒక్కరు తనకు పూర్తిగా సహకరించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

పాల్వాయి స్రవంతి ఇటీవల రేవంత్ రెడ్డితో సమావేశానికి ముందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో, పార్టీలోని నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ముందుకు వెళ్లాలని పాల్వాయి స్రవంతి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మునుగోడు టికెట్ ఆశించిన బీసీ నేతల అసంతృప్తిని తొలగించడం కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ లతో సమావేశమై వారిని అనునయించే ప్రయత్నం చేశారు. అభ్యర్థి ఎంపికలో తీసుకున్న ప్రమాణాలను, పార్టీ పరిస్థితిని నేతలకు వివరించి సహకారం అందించాలని కోరారు. ఇక పాల్వాయి స్రవంతి కూడా ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ తనకు సహకరించేలా, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన నేపథ్యంలో, పార్టీ సర్వశక్తులను ఒడ్డి మునుగోడు ఉపఎన్నికలలో పోరాటం చేయనుంది. ఈ క్రమంలోనే పార్టీలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో కావలసి ఉన్న నేపథ్యంలో పాల్వాయి స్రవంతి ఆ పని చేసుకుపోతున్నారు.

మరి పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం పాల్వాయి స్రవంతికి సాధ్యమవుతుందా? ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను చిత్తు చేసి కాంగ్రెస్ మళ్ళీ మునుగోడులో విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉందా? పాల్వాయి స్రవంతికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తిస్థాయిలో సహకరించే అవకాశం ఉందా? ఇక సొంత పార్టీలోని అసంతృప్తనాయకులు మద్దతు ఇస్తారా అన్నది ప్రస్తుతం మునుగోడు కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.