Google India: గూగుల్ ఇండియాలో లేఆఫ్స్.. 453 మందికి ఉద్వాసన

Google India:టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా దాదాపు 453 మంది ఉద్యోగులు లేఆఫ్స్ మెయిల్స్ అందుకున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి సదరు ఉద్యోగులకు సమాచారం అందింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపారని తెలుస్తోంది.

453 మంది అదనమా?(Google India)

రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు గూగుల్‌ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే అమెరికాలోని ఉద్యోగులకు సమాచారం ఇచ్చామని, ఇతర దేశాల్లో వారికి త్వరలోనే సమాచారం అందుతుందని సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అప్పట్లోనే పేర్కొన్నారు.

అయితే, గూగుల్‌ ప్రకటించిన ఈ భారీ లేఆఫ్‌ల ప్రక్రియలో భాగంగానే భారత్‌లో 453 మందిని తొలగించారా? లేక తాజా లేఆఫ్స్ అదనమా అనేది స్పష్టతగా తెలియడం లేదు.

ఉద్యోగం కోల్పోయామంటూ ఆవేదన

మరోవైపు గూగుల్‌ ఇండియా లో టెర్మినేషన్ లెటర్స్ అందుకున్న కొందరు లింక్డిన్‌ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్టులు పెడుతున్నారు.

గూగుల్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేశామని, తాజా తొలగింపుల్లో ఉద్యోగం కోల్పోయామంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. గూగుల్‌ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మెటా, ట్విటర్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఈ ఏడాది భారీగా ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే.