Prime9

KTR : అడ్వకేట్ ట్రస్ట్‌ను రూ. 500 కోట్లకు పెంచుతామని మంత్రి కేటీఆర్ హామీ.. తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనానికి హాజరు

KTR : హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు. అడ్వకేట్ ట్రస్ట్‌ను రూ. 500 కోట్లకు పెంచుతామని.. న్యాయవాదులకు వైద్య బీమాను కూడా పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కేసీఆర్ సింహాం లాంటోడని .. సింగిల్‌గానే వస్తారంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బక్క పలుచని కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు అందరూ ఏకమవుతున్నారని చురకలంటించారు. కేసీఆర్ 2014లో, 2018లో ఎవర్నీ నమ్ముకోలేదని.. ప్రజలను నమ్ముకున్నారని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజలనే నమ్ముకుంటున్నామని.. మాకు మా మీద, ప్రజల మీద విశ్వాసం వుందని మంత్రి తెలిపారు. కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కేటీఆర్ అన్నారు.

ఈ పోరాటం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతుందని కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్‌లో సీఎం దొరికారు కానీ.. ఓటర్లు దొరకడం లేదని , జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరని, కానీ సీఎం పదవి మాత్రం కావాలంటూ చురకలంటించారు. తెలంగాణకు 24 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని.. ఐటీ ఎగుమతులు 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకకు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయని కేటీఆర్ హెచ్చరించారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar