Prime9

Janasena Activist : ప్రమాదం గురించి హెచ్చరిస్తూ ఊహించని రీతిలో జనసేన కార్యకర్త మృతి.. ఎక్కడంటే ?

Janasena Activist : తన అభిమాన హీరోని ఆదర్శంగా తీసుకొని సామాజిక స్పృహతో.. ప్రజల కొరకు తాను కూడా అంటూ ఎప్పుడూ ముందుండే యువకుడు.. ప్రమాదం గురించి హెచ్చరిస్తూ ఊహించని రీతిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో చోటు చేసుకుంది. కళ్ళ ముందే విద్యుత్ వైరు తెగి ఉండడంతో.. ప్రమాదం గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెల్దామనుకున్నాడు. ఫోన్ లో వీడియో తీసి పంపిద్దామనుకునే క్రమంలో అదే విద్యుత్ వైర్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్య ఘటన స్థానికంగా అందరినీ కలచి వేస్తుంది.

వసంత కుమార్ పొందూరు పట్టణంలో క్రియా శీల జనసేన కార్యకర్తగా ఉన్నాడు. పట్టణ పరిధిలో ప్రజా సమస్యల పట్ల వెంటనే స్పందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోడ్డు పక్కన విద్యుత్ తీగలు తెగిపోయి వెలాడుతూ కనిపించాయి.అయితే అప్పటికే సమస్యను విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లామని అయినా వారు స్పందించలేదని స్థానికులు చెప్పడంతో.. తెగిపోయిన విద్యుత్ వైర్లను మొబైల్ లో వీడియో తీసి అధికారులకు పంపాలని భావించాడు. తన ఫోన్ లో వీడియో తీస్తుండగా తెగి వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ పొరపాటున వసంత్ కుమార్ కి తాకింది. దాంతో తీవ్రంగా వసంత్ గాయపడగా.. వెంటనే అతడిని చికిత్స కోసం పొందూరు హాస్పిటల్ కి తరలించారు. విద్యుత్ షాక్ లో తీవ్ర గాయాలు కావడంతో వసంత్ కుమార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే మృతి చెందాడు.

కాగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెల్లాలని భావించి చివరకు తుదిశ్వాస విడవడం అందరిని కలిచి వేసింది. వసంత్ కుమార్ (Janasena Activist) మృతి చెందినట్లు తెలిసి ఆమదాలవలస నియోజకవర్గ జనసేన ఇంచార్జి పేడాడ రామోహన్ రావుతో పాటు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ నిర్లక్ష్యం వల్లే వసంత కుమార్ చనిపోయాడని.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కుమార్ అంతిమయాత్రలో జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version
Skip to toolbar