TSRTC Independence Day Offer: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ వరాలు

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ బుధవారం ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 01:04 PM IST

Hyderabad: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రాయితీలు ప్రకటించింది. ఈ ఆగస్టు 15న పుట్టే శిశువులు, వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ బుధవారం ప్రకటించారు. 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. 75 ఏళ్లు పై బడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75 శాతం రాయితీపై మందులు అందించనున్నట్లు తెలిపారు.

ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌(టీఏవైఎల్‌) టికెట్‌ చార్జీలను రూ.120 నుంచి రూ.75కు తగ్గించినట్లు పేర్కొన్నారు. కేజీలోపు కార్గో పార్సిళ్ల పై ఆగస్టు 15న 75 కిలోమీటర్ల వరకు ఎలాంటి చార్జీ ఉండదని గోవర్ధన్‌ తెలిపారు. ప్రతి రోజూ దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 75 మందిని గుర్తించి తర్వాత ట్రిప్‌నకు ఫ్రీ టిక్కెట్‌ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. పుష్పక్‌ ఎయిర్‌పోర్టు సర్వీస్‌ బస్సుల్లో రూ.75 చార్జీతోనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు తెలిపారు.