Minister Mallareddy: ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి దూరం

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.

Minister Mallareddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కార్యాలయాలు విద్యాసంస్థల నుంచి ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేశారు. కీలక డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 28) నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఐటీ నోటీసులు అందుకున్న వారిలో మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, కీర్తి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రేయారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, నర్సంహ యాద్, జైకిషన్, రాజేశ్వర్ రావు, ఇద్దరు ప్రిన్సిపాల్స్ తదితరులు ఉన్నారు. మూడు రోజుల పాటు వీరిని ఐటీ అధికారులు విచారించనున్నారు.

కాగా ఈ విచారణకు మల్లారెడ్డి తాను హాజరు కాలేనని తన తరపున తన ఆడిటర్ విచారణకు హాజరవుతారని తెలిపారు. ఉప్పల్ లో జరగనున్న పలు కార్యక్రమాల్లో తాను పాల్గొనాల్సి ఉందని అందుకే విచారణకు వెళ్లలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. నోటీసులు అందుకున్న మిగిలినవారంతా విచారణకు హాజరవుతారని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే విచారణ నేపథ్యంలో ఐటీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు