Prithvi Shaw: టీంఇండియా ఆటగాడు పృథ్వీ షా పై దాడి

టీమ్‌ఇండియా ఆటగాడు పృథ్వీ షా పై దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి ఫిబ్రవరి 15 న ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లారు.

Prithvi Shaw: టీమ్‌ఇండియా ఆటగాడు పృథ్వీ షా పై దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి ఫిబ్రవరి 15 న ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లారు. ఆ సమయంలో పలువురు పృథ్వీ షా తో పాటు తన ఫ్రెండ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు స్థానిక ఓషివారా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో షా ప్రయాణిస్తున్న కారును నిందితులు బేస్ బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. దాదాపు 8 మంది పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముందు సెల్ఫీలు ఇవ్వనందుకు దాడి చేసినట్లు భావించినా.. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని పృథ్వీ షా స్నేహితుడు ఆశిశ్ సురేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.

దాడి జరిగిందిలా..(Prithvi Shaw)

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్రతో కలిసి పృథ్వీ షా శాంటా క్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్లాడు.

నిందితులు సెల్ఫీ కోసం పృథ్వీ షా వద్దకు రాగా.. ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా ఆసక్తి చూపాడు.

అయితే గ్రూప్‌లోని మిగతా సభ్యులు కూడా వచ్చి సెల్ఫీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తాను స్నేహితులతో కలిసి భోజనానికి వచ్చానని, అందరితో సెల్ఫీ ఇవ్వడం కుదరదని పృథ్వీ షా సమాధానం ఇచ్చాడు.

అయితే షా ఎంత చెప్పినా వినని వాళ్లు.. సెల్ఫీల కోసం పట్టుబట్టడంతో వెంటనే హోటల్‌ మేనేజర్‌ను పిలిచారు. హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని నిందితులను మేనేజర్ చెప్పారు.

అయితే ఇదంతా మనసులో పెట్టుకున్న నిందితులు హోటల్‌ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ షా, అతడి స్నేహితుడి కారుపై బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.

బీఎండబ్ల్యూ కారు వెనుక, ముందర భాగంలోని కిటికీలు ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు

సంఘటన జరిగినపుడు పృథ్వీ షా కారులోనే ఉన్నాడని.. ఈ ఘటనను పెద్దగా చేయకూడదనే ఉద్దేశంతో అతడిని వేరే కారులో సురక్షితంగా ఇంటికి పంపించినట్లు సురేంద్ర తెలిపారు.

అయితే అప్పటికీ ఆగని నిందితుల్లో ఓ మహిళ తన కారును వెంబడించి మరీ జోగేశ్వరి లోటస్ పెట్రోల్‌ పంప్‌ దగ్గర ఆపేసిందని సురేంద్ర పేర్కొన్నారు.

ఈ సమస్యను షెటిల్ చేసుకోవడానికి 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. లేకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని వెల్లడించారు.

సురేంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

పృథ్వీ షాను సెల్ఫీలను అడిగిన వాళ్ల వివరాలను హోటల్‌ సిబ్బంది నుంచి పోలీసులు తీసుకున్నారు.

నిందితులిల్లో ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు.

ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్స్‌ 143, 148, 149, 384, 437, 504, 506 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.