Delhi government: బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 ఫైన్.. ఢిల్లీ సర్కార్ నిర్ణయం

దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం కారణంగా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటం పై నిషేధం విధించింది.

  • Written By:
  • Publish Date - October 20, 2022 / 11:57 AM IST

Delhi: దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం కారణంగా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటం పై నిషేధం విధించింది. ఫైర్‌క్రాకర్స్‌ కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానా విధించటంతో పాటు, 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ప్రకటన చేశారు.

బాణసంచా తయారీ, నిలువ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారు. అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్‌ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. బాణాసంచా బదులు దీపాలు వెలిగించి పండుగ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 21న సెంట్రల్‌ పార్క్‌ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తున్నామని గోపాల్ రాయ్ చెప్పారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఫైర్‌క్రాకర్స్‌ తయారు చేయటం, విక్రయించటం సహా అన్నింటిపై జనవరి 1 వరకు నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో దీపావళికి సైతం ఎలాంటి మినహాయింపునివ్వలేదు. గత రెండేళ్లుగా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.