Raids at BBC: బీబీసీలో మూడో రోజు ఐటీ సోదాలు.. రెండు రోజులుగా ఆఫీస్ లోనే ఉద్యోగులు

ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై లోని సంస్థ కార్యాలయాల్లో సర్వే పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

Raids at BBC: ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై లోని సంస్థ కార్యాలయాల్లో సర్వే పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి బీబీసీకి చెందిన 10 మంది ఉన్నత స్థాయి సిబ్బంది తమ ఇళ్లకు కూడా వెళ్లలేదని సమాచారం. ఈ సోదాల్లో భాగంగా ఉన్నత స్థాయి ఉద్యోగులు కొంతమంది కార్యాలయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

50 గంటల నుంచి సోదాలు(Raids at BBC)

మంగళవారం బీబీసీ పై ఈ దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 50 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయాల్లో పత్రాల పరిశీలన నిరంతరంగా కొనసాగుతోంది.

బీబీసీలోని ఆర్థిక విభాగంతో పాటు మరికొన్ని డిపార్ట్ మెంట్స్ కు సంబంధించిన సిబ్బందితో ఐటీ అధికారులు మాట్లాడుతున్నారు.

ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది, జర్నలిస్టులు మాత్రం మంగళవారం రాత్రే ఇళ్లకు వెళ్లిపోయేందుకు ఐటీ అధికారులు అనుమతించారు.

అయితే ఇండియా బీబీసీ వీక్షకులకు సేవలు ఎప్పటిలానే కొనసాగుతున్నట్టు బీబీసీ తెలిపింది. ఐటీ సోదాల వల్ల సేవలకు ఎలాంటి అంతరాయం కలగదని తెలిపింది.

ఇది కేవలం ప్రచార కార్యక్రమం

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ ఇటీవల ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది.

అయితే, గుజరాత్ మారణకాండకు సంబంధించి మోదీకి సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇలా వివాదాస్పద డాక్యుమెంటరీ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీంతో డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

ఈ క్రమంలో ఐటీ శాఖ మంగళవారం సోదాలు జరిపింది. 2012 నుంచి ఆదాయపు పన్ను వివరాలను పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సోదాలను.. సర్వే గా ఐటీ అధికారులు పేర్కొంటున్నారు.

ఐటీ దాడులు జరగడంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టుల సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ లతో దాడులు జరిపించడం ఏంటని మండిపడ్డాయి.

అయితే ఈ అంశంపై విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ. ‘ఇది కేవలం ఒక ప్రచార కార్యక్రమం.

వారు ఎంచుకున్న కోణాన్నిప్రచారం చేయడానికి మాత్రమే ఈ డాక్యుమెంటరీని రూపొందించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మీడియా సేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నాం: అమెరికా

తాజాగా బీబీసీ పై ఐటీ అధికారులు చేస్తున్న సర్వే పై అమెరికా స్పందించింది. ‘బీబీసీలో సోదాల అంశం మా దృష్టికి వచ్చింది. ఈ దాడుల అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా మీడియా సేచ్ఛకు మేము ప్రాధాన్యం ఇస్తున్నాం.

ప్రజా సామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్చ, మతం దోహదపడతాయి.

భారత్ లో కూడా ఇవే బలోపేతం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలను మేం నిరంతనం ప్రస్తావిస్తాం.’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.