Janasena chief Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాదకరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నియంత్రించేందుకే వాలంటీర్ వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్లిపోతోందని విమర్శించారు

  • Written By:
  • Updated On - July 10, 2023 / 08:57 PM IST

Janasena chief Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నియంత్రించేందుకే వాలంటీర్ వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్లిపోతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు సేవలు అందించేందుకు ఇన్ని వ్యవస్థలున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏం చేయాలని ప్రశ్నించారు. తాను చెప్పేది అందరు వాలంటీర్ల గురించి కాదని అన్నారు.

అవసరానికి మించి డేటా ఇవ్వకండి..(Janasena chief Pawan Kalyan)

వాలంటీర్ వ్యవస్థతో జాగ్రత్తగా ఉండాలి. వాలంటీర్లకు అవసరానికి మించి మీ డేటా ఇవ్వకండి. వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాదకరంగా తయారవుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లకు రూ.5000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారు.మీ సమాచారం అంతా వాళ్ళకి తెలుసు.ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అంతా తెలుస్తోంది.మరి ఈ సమాచారం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంటే ఎలా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఉద్దేశం వేరే అవ్వచ్చు.సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తాజా షెడ్యూల్‌ని ఆ పార్టీ ప్రకటించింది. ఈ నెల 11న మధ్యాహ్నం 12 గంటలకి దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం మూడు గంటలకి ఉంగుటూరు నియోజకవర్గం ముఖ్య నేతలు, వీర మహిళలతో సమావేశం అనంతరం తాడేపల్లి గూడేనికి చేరుకుంటారు. 12న సాయంత్రం 5 గంటలకి తాడేపల్లి గూడెంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి తాడేపల్లి గూడెం నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలకి తణుకు చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకి తణుకు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం అవుతారు. 14వ తేదీ సాయంత్రం 5 గంటలకి తణుకులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.