Nara Lokesh: తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదు.. నారా లోకేశ్

ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం రాత్రి యువగళం-నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదని అన్నారు.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 08:43 PM IST

Nara Lokesh: ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం రాత్రి యువగళం-నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదని అన్నారు.

విజనరీ అంటే చంద్రబాబు..( Nara Lokesh)

విజనరీ అంటే చంద్రబాబు అని ప్రిజనరీ అంటే జగన్ అని లోకేశ్ అన్నారు. జగన్‌ అరెస్టుయితే రోజుకో స్కామ్‌ బయటపడేది. ప్రజాస్వామాన్ని సీఎం జగన్‌రెడ్డి దెబ్బతీశారు. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్‌ ఏంటో చూపిస్తాం. రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచిన వ్యక్తి పేదవాడు అవుతారా? అంటూ ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. రాష్ట్రంలో అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించింది. అదే సమయంలో చంద్రబాబు తెచ్చిన కంపెనీలు, సిమ్మెంటు పరిశ్రమలు, నిర్మించిన రహదారులు కనపడ్డాయని అన్నారు. ఐదేళ్లలో 12 లక్షలకోట్లు అప్పులు చేసి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి రాక్షసంగా పరిపాలిస్తన్న జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగమని లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ను ఒకే వేదికపై చూసి… జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.

కోడికత్తి వారియర్స్‌..

చంద్రబాబు అరెస్టయిన తరువాత తనకు మొదట ఫోన్ చేసి అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ అని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త పథకం తెచ్చారు. మా జీవితాలతో ఆడారని ప్రజలు చెబుతున్నారు. జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు కోడి కత్తి వారియర్స్‌. కోడికత్తి వారియర్స్‌ ఆటగాడు అవినాశ్‌రెడ్డి. బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌.. అరగంట స్టార్‌ అంబటి.. గంట స్టార్‌ అవంతి.. ఆల్‌రౌండర్‌ గోరంట్ల మాధవ్‌, రీల్‌ స్టార్‌ భరత్‌.. పించ్‌ హిట్టర్‌ బియ్యపు మాధవరెడ్డి అంటూ లోకేశ్ ఎద్దేవా చేసారు. నవశకం మొదలయిందని, గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడతామని లోకేశ్ పేర్కొన్నారు.