Bandi Sanjay : బండి సంజయ్ ఐదవ విడత పాదయాత్ర వాయిదా

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 06:58 PM IST

Bandi Sanjay:   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల యాత్రను పూర్తి చేసిన బండి సంజయ్.. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్రను చేపట్టాలని భావించారు. బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర బైంసా నుంచి కరీంనగర్ వరకు కొనసాగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

అయితే తాజాగా బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బండి సంజయ్ తన ఐదో విడత పాదయాత్ర వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నంచి బీజేపీ ముఖ్య నేతలు మునుగోడులో మకాం వేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవనున్నారు.

నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.