APCC President S. Sailajanath: తిక్క విధానాలు వీడాలంటూ విన్నపాలు

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు శైలజానాధ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి తిక్క విధానాలు వీడండి అంటూ ఓ విన్నపం చేసుకొన్నారు.

Vijayawada: కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు శైలజానాధ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల పేరుతో మాట్లాడుతున్న సీఎం జగన్ తల తిక్క వ్యవహారాలను మానుకోవాలని సూచించారు. ఆయన చేతకాని విధానాలతో ప్రజలు సతమతమౌతున్నారని విమర్శించారు. ప్రపంచంలో రాజధానిలేని ఏకైన ప్రాంతం ఏపీనే అన్న శైలజానాధ్ తగ్గేదేలదంటూ రాజధాని విషయంలో మంత్రులు బీరాలు పోతున్నారని, ఇదంతా ఎవరి కోసం ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలనేదే కాంగ్రెస్ అభిమతమన్నారు. చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే జగన్ మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఆయనతో ఏం గొడవ వచ్చిందో జగన్ చెప్పాలన్నారు. రాయలసీమ వాసులుగా మాకు అప్పుడు ఇబ్బంది అనిపించినా, రాష్ట్ర ప్రజల మేలును కోరుకుంటూ నాడు అమరావతికి అండగా నిలిచామన్నారు.

జగన్ సీఎంగా ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? రోడ్ల మీద తిరిగితే గదా వాస్తవాలు తెలిసేదని శైలజానాథ్ జగన్ కు హితవు పలికారు. శ్రీభాగ్ ఒప్పందం‌ పై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదన్న శైలజానాధ్ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్‌కు మంచిదని గుర్తించాలని వేడుకొన్నారు. జగన్ ప్రభత్వ వైఫల్యాలను విమర్శిస్తే దాడులు చేస్తారా, పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు‌ చేయిస్తారా అని ప్రశ్నించారు. న్యాయ రాజధాని, శాసన రాజధాని, పాలన రాజధాని అనేది ప్రజల మధ్య విద్వేషాల కోసమేనని, జగన్‌కు రాష్ట్ర అభివృద్ధి పై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని శైలజానాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.