Jagananna Vidya Deevena: పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే.. సీఎం జగన్మోహన్ రెడ్డి

పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంది. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 01:13 PM IST

Andhra Pradesh: పిల్లలకు మనమిచ్చే విలువైన ఆస్తి చదువు. విద్యార్థుల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వాన్నే భరిస్తుంది. అందులో భాగంగానే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. బాపట్లలో గురువారం జగనన్న విద్యాదీవెన కార్యక్రమం సందర్బంగా మాట్లాడుతూ రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు ఏప్రిల్‌-జూన్‌ 2022 కాలానికి గానూ, 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే. ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరినీ చదివించండి. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్‌లు రావాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించాం. చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాటు కాకూడదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగం పై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చుపెట్టాం. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. అనంతరం 2022 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.