Ap Deputy CM Pawan Kalyan Serious on Telugu Movie Industry: తెలుగు చిత్ర పరిశ్రమకు కూటమి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా.. సినీ సంఘాలు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారా..? అని ప్రశ్నించారు.
“గత ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల ఎలా వ్యవహరించిందో గుర్తు లేదా. అగ్ర నటులను, సినీ పెద్దలను ఎలా ఛీత్కరించిందో పరిశ్రమ పెద్దలు మర్చిపోయినట్టున్నారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది” అన్నారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగా స్వీకరిస్తానంటూ సినీ పరిశ్రమను ఆయన హెచ్చరించారు. తమ డిమాండ్స్ నెరవేర్చాలని లేదంటూ జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రీబ్యూటర్ల హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఇవాళ ఈ అంశంపై ఫిలిం ఛాంబర్ భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినీ పెద్దలను ఉద్దేశిస్తూ చేసిన ఈ ప్రకటన ఆసక్తిని సంతరించుకుంది. “ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగవాటిల్లకుండ కూటమి ప్రభుత్వం చూస్తోంది. కానీ సినీ పెద్దలకు ఇవేవి కనిపించడం లేదు. ఎన్డీయే ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కూడా కనిపించడం లేదు. తెలుగు సినీ పెద్దలు ఒక్కసారైనా గౌరవ సీఎం చంద్రబాబను కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో మాత్రమే ప్రభుత్వం ముందుకు వస్తున్నారు.
సినీ పెద్దలంత కలిసి చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎప్పుడైనా కలిసారా. అందరూ కలిసి రావాలని చెప్పినప్పటికీ సానుకూలంగా స్పందించలేదు. అగ్ర నటులు, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించిందో అందరు మర్చిపోయారు” ఏపీ డిప్యూటీ సీఎం సినీ పెద్దలపై ధ్వజమెత్తారు. “ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, వై సుప్రియ, చినబాబు, సి అశ్వనీదత్, నవీన్ ఎర్నేనీ వంటి తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటీతంగా రావాలని చెప్పాం.
అయినా ఎవరికి వారు వ్యక్తిగతం వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని కోరుతూ సినిమాటోగ్రఫీ శాఖకు విజ్ఞప్తి పత్రాలు ఇస్తూ వచ్చారు. అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే వచ్చింది. ఇది మాకు తెలుగు సినీ పరిశ్రమలో కొందరు పెద్దలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ రిటర్న్ గిఫ్ట్కు తగ్గట్లే మేమూ పనిచేస్తామని పేర్కొన్నారు. ఇకపై సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపేది లేదని, వ్యక్తిగతం చర్చలు ఉండబోవన్నారు. వ్యక్తిగతంగా వచ్చిన టికెట్ ధరలు పెంచమని కోరడం ఎందుకు? అందరిని కలిసి రమ్మంటే ఎవరూ రాలేదు” అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.